Friday 4 March 2016

Raya Bhupaala Patnam - RB Patnam - Peddapuram

రాయ భూపాల పట్నం - రాగమ్మ చెరువు - రత్నగర్భ వినాయకుడు 








రాయభూపాల పట్నం - వత్సవాయి రాయ జగపతి మహారాజు గారు కొంపెల్ల మహా లక్ష్మి (లక్ష్మీసోదెమ్మ) అనే బ్రాహ్మణ వితంతు మహిళకి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించిన లక్ష్మీపుర ఆగ్రహారానికి నామాంతరం.
అసలు ఈ కొంపెల్ల మహా లక్ష్మి ఎవరు రాజు గారు ఈమెకు ఎందుకు ఋణపడ్డారు అనే విషయం తెలియాలంటే ఈ చిన్న కదా చదవాల్సిందే .... !
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటను ఆక్రమించుకోవడానికి సైన్య సమేతం గా బయలుదేరాడన్న విషయం వేగుల(గూడాచారులు) ద్వారా రాగమ్మ గారికి తెలిసింది. ఏడాది బాలుడు, పెద్దాపురం సంస్థాన భావి వారసుడైన రాయగజపతిని తనకు అత్యంత సన్నిహితురాలైన కొంపెల్ల మహా లక్ష్మి (లక్ష్మీసోదెమ్మ) కి ఇచ్చి విజయనగర సంస్థాన మహారాజు పూసపాటి విజయరామరాజు గారి భార్య చంద్రాయమ్మకు ఇక్కడ జరిగినదంతా తెలియ చేసి ఈ బాలున్ని అప్పగించ వలసినదిగా ఆజ్ఞాపించింది. ఆతరువాత రాగమ్మ గారు మిగిలిన అంతపుర స్త్రీలు అందరు పెద్దాపుర సంస్థానానికి నమ్మకస్తుడైన సేవకుడు చల్లా పెద్ది చేత కోటకి నిప్పు పెట్టించుకుని అగ్నిప్రవేశం చేసారు.
కొంపెల్ల మహా లక్ష్మి పసిబాలుడు రాయ జగపతి ని ఎత్తుకుని విజయనగరం బయలు దేరుతుండగా మార్గమద్యంలో రుస్తుం ఖాన్ అనుచరులు ఆమెను ఆపి ఆబాలుడు ఎవరు అని ప్రశ్నించారు. దానికి ఆమె నా బాలుడే అని సమాదానం ఇచ్చింది. ఆ యొక్క వితంతు బ్రాహ్మణ స్త్రీ వేష దారణ చూసిన సైనికులకు ఆమెపై అనుమానం వచ్చి ఒక జామ పండు తెచ్చి ఆ బాలుడు తో కొరికించి ఆ ఎంగిలి పండును ఆమె ను తినమని చెప్పారు (ఆచార నియమాలు పవిత్రం గా బావించే ఆనాటి బ్రాహ్మణ స్త్రీలకు ఎంగిలి (యుచ్చిష్ట ఫలం) నిషిద్దం) అయినా బాలుని సంరక్షణార్ధం వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఆ ఎంగిలి పండు తిని వారిని నమ్మించి అక్కడ నుండి బయలుదేరెను. ఆ వెనువెంటనే పెద్దాపురం కోట చేరుకున్న రుస్తుం ఖాన్ జరిగిన విషయం అంతా తెలుసుకుని సైనికులపై మండిపడి తక్షణమే బాలున్ని పట్టుకుని తీసుకు రావాల్సింది గా సైనికులను ఆజ్ఞాపించాడు.
ఆ బ్రాహ్మణ స్త్రీ సైనికులకు బాలుడుతో సహితం గా చేబ్రోలు వద్ద దొరికి పోయింది. బాలుడు రాయజగపతి ని చెరశాల లో వుంచవలసినది గా రుస్తుం ఖాన్ ఆజ్ఞాపించాడు. అంతట ఆ కొంపెల్ల మహా లక్ష్మి గారు నేనూ బాలుడితో సహా చెరలో ఉండేందుకు అనుమతించమని రుస్తుం ఖాన్ ను వేడుకుంది. చెర శాలలోనే ఉంటూ బాలున్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. రాయ జగపతి ని చెరనుండి విడిపించడానికి అహర్నిశలూ కృషి చేసింది.
రుస్తుం ఖాన్ బార్యతో సన్నిహితం గా ఉంటూ అదను చూసుకొని రాయ జగపతి రుస్తుం ఖాన్ వద్దనే బందీగా ఉన్నాడనే విషయం విజయనగరానికి చేర వేసింది.
రుస్తుం ఖాన్ ను తన సొంత కొడుకు నూరుద్దీన్ ఖాన్ చేతిలో నే దారుణంగా హత్య కావించబడ్డాడు.
విజయనగర మహారాజు పెద విజయరామ రాజు గారు పదివేల సైన్యంతో మరియు 2 వేల భోయీల తో నూరుద్దీన్ ఖాన్ పై దండెత్తి వచ్చి చేబ్రోలు దగ్గర పెద్దయుద్ధం చేసి నూరుద్దీన్ ఖాన్ ను హతమార్చి బాలున్ని చెరనుండి విడిపించి యుక్త వయస్సు వచ్చే వరకూ తమ వద్దనే ఉంచుకుని "నీమత్ ఆలీ” తో ఒప్పందం కుదుర్చుకుని పెద్దాపురం సంస్థానా నికి రాయ జగపతి ని రాజు చేసెను.
ఆ రకంగా ఎంతో సాహసంతో, తన ప్రాణాలకు తెగించి వత్సవాయ వంశాంకుర మైన తనను కాపాడినందుకు కృతజ్ఞతతో తాను సంస్తానాదీశుడైన వెంటనే కొంపెల్ల మహాలక్ష్మి గారి కి ఒక అగ్రహారాన్ని బహుమతి గా ఇచ్చారు. ఆ తరువాత రాజుగారి తాతగారు రాయపరాజు పేరుమీద అక్కడ ప్రతీ సంవత్సరం అనేక కార్యక్రమాలు, యజ్ఞ యాగాలు జరిగేవి. అందుచేత ఆ ఆగ్రహారానికి రాయభూపాల అగ్రహారం అని పేరు వచ్చింది. ఆ రాయభూపాల అగ్రహారమే ఇప్పటి రాయభూపాల పట్నం.
రాగవమ్మ చెరువు
ఆ తరువాత కాలంలో ఆ అగ్రహారమంతా పంటలు సుభిక్షం గా పండేందుకు వీలుగా రాయ జగపతి గారి నాయనమ్మ/ అగ్ని ప్రవేశం ఆత్మత్యాగం చేసుకున్న రాగమ్మ గారి పేరు మీద పెద్ద చెరువు త్రవ్వించినట్లు స్థానిక చరిత్రము నుండి తెలుస్తున్నది.
రత్నగర్భ వినాయకుడు.
అతి పురాతనమైన ఎంతో చరిత్రగలిగి తన పొట్టలో రత్నాలను దాచుకున్న శ్రీ రత్న గర్భ వినాయకుల వారికి రాజుల కాలం నుండీ కూడా ఎంతో వైబోగం జరిగిందని ప్రతీతి.
మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...